వైఎస్ షర్మిల పార్టీ వైపు తెలంగాణ యువ కెరటం: తీన్మార్ మల్లన్న: చేరట్లేదంటూనే సానుకూల సంకేతాలు
హైదరాబాద్: తీన్మార్ మల్లన్న.. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. జర్నలిస్ట్గా కేరీర్ను ఆరంభించి, రాజకీయాల్లోకి ప్రవేశించిన యువకెరటంగా గుర్తింపు ఉంది. ఎవరి అండదండలు లేకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్ర ఎన్నికల్లో పోటీ చేసి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో గెలుపుటంచుల వరకూ వెళ్లారు. స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. అప్పటి నుంచీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారాయన. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిల్చుంటారనే వార్తలొచ్చినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు.
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి..
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సరైన సమయం.. పార్టీ కోసం ఎదురు చూస్తున్నారనే అభిప్రాయాలు తీన్మార్ మల్లన్నపై ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన తన రాజకీయ ప్రస్థానంపై ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొత్తగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. అయినప్పటికీ- టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాజకీయాలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. తటస్థ రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానం ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఏ పార్టీలో చేరడం గానీ.. కొత్త పార్టీని పెట్టడం గానీ ఉండబోదని అన్నారు.
షర్మిల పార్టీపై..
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల నెలకొల్పబోయే పార్టీపై తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె మున్ముందు కొన్ని అద్భుతాలు సృష్టించే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. షర్మిలది కష్టపడే మనస్తత్వమని, తన అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకోవడానికి తన తల్లి విజయమ్మతో కలిసి శ్రమించారని గుర్తు చేశారు. అన్న కోసం పాదయాత్ర చేశారని చెప్పుకొచ్చారు.
ఆమె తెలంగాణ ఆడపడుచు..
వైఎస్ షర్మిల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహిళే అయినప్పటికీ.. ఆమెను తెలంగాణ ప్రజలు ఆడపడుచుగానే చూస్తున్నారని మల్లన్న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా.. ఎక్కడైనా పార్టీని నెలకొల్పే హక్కు ఉందని, ఇది షర్మిలకూ వర్తిస్తుందని చెప్పారు. రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఒకట్రెండు ప్రాంతీయ పార్టీలు ఎక్కడో ఢిల్లీలో చక్రం తిప్పిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తెలుగు నాయకులు రాణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిని గానీ, వారు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పార్టీలను గానీ.. ఏ ఒక్క ప్రాంతానికో లేక రాష్ట్రానికో పరిమితం చేయలేమని ఆయన విశ్లేషించారు.
చెట్టు పేరు చెప్పుకొంటే సరిపోదు..
చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకుంటామంటే ప్రస్తుత రాజకీయాల్లో కుదరదని ఆయన వైఎస్ షర్మిలను ఉద్దేశించి చెప్పారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాల్లో చేస్తే.. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని తీన్మార్ మల్లన్న అంచనా వేశారు. ప్రజల్లో తిరగాల్సిందేనని, ప్రజలకు చేరువ కావాల్సిందేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగారని, 3,647 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని, అందుకే అధికారాన్ని అందుకోగలిగారని చెప్పారు. షర్మిల కూడా అదే తరహాలో శ్రమించాల్సి ఉంటుందని, ఆమెది శ్రమించే మనస్తత్వమని చెప్పుకొచ్చారు.