తెలంగాణలో లేటెస్ట్ కరోనా రిపోర్ట్: 9 వేలకు దిగువగా పేషెంట్లు: వేగంగా తగ్గుతోన్న వైరస్ ఎఫెక్ట్
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు వెయ్యికి లోపే నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా పరిమితంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు మించట్లేదు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ విజృంభణకు తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కళ్లెం వేయగలిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య తొమ్మిది వేలకు దిగువగా నమోదు అయ్యాయి. కొత్త కేసుల నమోదులో వేగం మందగించడం ఊరటనిస్తోంది.
Recommended Video
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 609 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 873 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,71,492కు చేరుకుంది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,61,028 మంది ఉన్నారు. 1,465 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు తొమ్మిది వేలకు దిగువగా నమోదు అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 8,999 యాక్టివ్ కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి.
గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 6,922 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొత్త కేసులు పరిమితంగానే నమోదవుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
జిల్లాలవారీగా ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-24, జగిత్యాల-15, జనగామ-14, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-1, కామారెడ్డి-10, కరీంనగర్-22, ఖమ్మం-24, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్నగర్-9, మహబూబాబాద్-13, మంచిర్యాల-12, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్గిరి-45, ములుగు-19, నాగర్ కర్నూల్-11, నల్లగొండ-23, నిర్మల్-8, నిజామాబాద్-10, పెద్దపల్లి-15, రాజన్న సిరిసిల్ల-15, రంగారెడ్డి-48, సంగారెడ్డి-12, సిద్ధిపేట్-14, సూర్యాపేట్-19, వికారాబాాద్-14, వనపర్తి-8, వరంగల్ రూరల్-12, వరంగల్ అర్బన్-29, యాదాద్రి భువనగిరి-14 కేసులు నమోదు అయ్యాయి. నారాయణపేట్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 53,686 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 56,05,306గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,50,599 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.