షాకింగ్ : నిర్మల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మృతి...
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది గంటలకే తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మృతి చెందడం నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం(జనవరి 19) కుంటాలలోని ప్రైమరీ హెల్త్ కేర్లో విఠల్ అనే 108 అంబులెన్స్ డ్రైవర్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నాడు. రాత్రి సమయంలో విఠల్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం(జనవరి 20) అతను మృతి చెందాడు. అతని మరణానికి కరోనా వ్యాక్సినే కారణమా.. లేక మరేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు.
Recommended Video
ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా కేవలం హెల్త్ కేర్ సిబ్బందికి మాత్రమే టీకా పంపిణీ ఇస్తున్నారు. అయితే టీకా తీసుకున్న కొందరిలో మైనర్ రియాక్షన్స్ కనిపిస్తుండటం,కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురవతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పటికే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు సైతం వెనుకడుగు వేస్తున్నారు.

రెండు రోజుల క్రితం కర్ణాటకలోని బళ్లారిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 43 ఏళ్ల హెల్త్ కేర్ సిబ్బంది ఒకరు గుండెపోటుకు గురై మృతి చెందారు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే అతనికి గుండె పోటు వచ్చి మరణించడం తీవ్ర కలకలం రేపింది. అయితే అతని మరణంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.అతనితో పాటు వ్యాక్సిన్ తీసుకున్న ఇతర హెల్త్ కేర్ సిబ్బందిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు.
మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోనూ ఓ వార్డు బాయ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 16న వ్యాక్సిన్ తీసుకున్న అతను... మరుసటిరోజే ఛాతి నొప్పి,శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు వదిలినట్లు నిర్దారించారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications