ఈనెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ -18న బడ్జెట్ సమర్పరణ -నోటిఫికేషన్ జారీ -14న ఎమ్మెల్సీ ఎన్నికలు
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలకు సంబంధింది మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. అందులోని వివరాల ప్రకారం..
మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాతి రోజైన 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక..

అతి కీలకమైన రాష్ట్ర బడ్జెట్ ను ఈనెల 18న ప్రవేశపెట్టనున్నారు. ఆ వచ్చే గురువారం(18న) ఉదయం 11:30 నిమిషాలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. కరోనా విలయం కారణంగా తెలంగాణ ఆదాయం రూ.50 వేల కోట్లు కోల్పోయినప్పటికీ, బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని, కేటాయింపులు గట్టిగానే ఉండాలని సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షలో వ్యాఖ్యానించారు. కాగా,
ప్రస్తుతం రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానంతోపాటు రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతోన్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద ఎత్తున స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 14న జరుగనుంది. ఆ తర్వాతి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications