కాంగ్రెస్కు షాక్?: అసెంబ్లీ ప్రాంగణంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోందా? ఇప్పటికీ సీఎల్పీ నేతను ఆ పార్టీ ఎన్నుకోలేదు. మరోవైపు, కొందరు ప్రజాప్రతినిధులు తెరాస వైపు చూస్తున్నారనే ప్రచారం? ఇంకోవైపు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయననే ఎమ్మెల్యే ఓ వైపు.. ఇలాంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లలో గెలిచి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇద్దరు స్వతంత్రులు కూడా తెరాసలో చేరారు. ఖమ్మం నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిపై టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేల వరకు తెరాసలో చేరుతారనే ప్రచారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. ఇందులో కీలక నేతలు ఉండటం గమనార్హం.
మరోవైపు, సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) తాను నాలుగేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయనని చెప్పారు. ఇంకోవైపు, సీఎల్పీ ఎన్నిక పూర్తి కాలేదు. ఇందుకోసం పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామాలకు తోడు తాజాగా, ఓ ఎమ్మెల్యే అంశం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఓ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాళ్లను మొక్కారట. సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి గెలిచారు. గతంలో వరుసగా మూడుసార్లు తెరాస అభ్యర్థి పైనే పోటీ చేసి ఓడిపోయారు. అయితే అంతకుముందు, ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీ వెంటే ఉన్నారు. ఆ నేత తాజాగా కాంగ్రెస్ నుంచి మొదటిసారి గెలిచారు. గురువారం అసెంబ్లీలో సీఎం కాళ్లు మొక్కారు. ఇది చర్చకు దారి తీస్తోంది.
గురువారం తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత మహిళలు, అనంతరం ఇంగ్లీష్ వరుస అక్షరాల క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. వందేమాతరం పాడని, దేశాన్ని గౌరవించని మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉండగా తాను ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు.