బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలు: డీజీపీ హెచ్చరిక
బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేంద్ర స్పందించారు.క్రమశిక్షణతో కూడిన ఫోర్సులో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పోలీసుల ఆందోళనలు క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘనలు సహించమన్నారు. ఆందోళనలు చేస్తున్నవారిపై చర్యలుంటాయన్నారు.
ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. శనివారం కూడా ఆందోళనలు కొనాగించారు. ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ శనివారం ఓ ప్రకటన విడుద చేశారు.

సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడ సరికాదన్నారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు.
కాగా, ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డెక్కగా.. నేడు ఏకంగా కానిస్టేబుళ్లే ఆందోళనలకు దిగారు. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కమాండెంట్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మరోవైపు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ వారి కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై 'ఏక్ స్టేట్ ఏక్ పోలీస్' పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా, రాస్తారోకో ర్యాలీలను చేపట్టారు .బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనలను చేస్తున్న కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు. శుక్రవారం కూడా సచివాలయం ముట్టడికి యత్నించగా.. కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications