నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ హోదాలో తొలిసారి అసెంబ్లీలో తమిళిసై..
నేటి(మార్చి 6) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉధయం 11గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది.
Recommended Video
అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఎసీ సమావేశం జరుగుతుంది. సభలో చర్చకు రావాల్సిన అంశాలు.. సమావేశాలు జరపాల్సిన రోజులు.. వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఎజెండాను రూపొందిస్తారు.సమావేశాల తొలిరోజు ఉదయం 10గంటలకు టీఆర్ఎస్ శాసనసభ్యలు,మండలి సభ్యులు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు.
గవర్నర్ పదవిని చేపట్టిన తర్వాత తమిళిసై తెలంగాణ ఉభయ సభల్లో ప్రసంగించనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పత్రిని సీఎం కేసీఆర్ గవర్నర్కు అందజేశారు. ఇక తొలిసారి ఆర్థికమంత్రి హోదాలో హరీశ్ రావు అసెంబ్లీలో 2020-21 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తారు.వార్షిక బడ్జెట్కు ఇప్పటికే సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దారు.
అనంతరం సభలకు హాజరవుతారు. ఈ నెల 22లోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా శాసనసభను 10 నుంచి 12 రోజులు,మండలిని 5 లేదా 6 రోజుల పాటు నిర్వహించనున్నట్టు సమాచారం. సోమవారం(మార్చి 9) హోలీ కావడంతో ఆరోజు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఇదే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉంది. సీఏఏ చట్ట విరుద్దమని.. దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయబోదని సీఎం కేసీఆర్ గతంలో కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజా సమావేశాల్లో సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని పాస్ చేసే అవకాశం ఉంది.