నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ .. రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక అంశాలపై ఫోకస్
నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ,హరీష్ రావు ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. బావ బామ్మరుదుల నిర్ణయాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సైతం నెలకొంది.
క్యాబినెట్ భేటీలో రెవెన్యూ చట్టంపై ఫోకస్
ప్రధానంగా ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ కార్మికుల సమ్మె, సచివాలయం కూల్చివేత వంటి అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందులోభాగంగా నేడు రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో, ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో కీలక చర్చ జరగనున్నట్లు గా తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ఆర్టీసీపై ప్రధాన చర్చ
ఒకపక్క ఏపీలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. నష్ట నివారణకోసం ఆర్టీసీని ప్రభుత్వం శాఖలో విలీనం చేస్తున్నట్లుగా ఏపీ సర్కార్ ప్రకటించింది. తెలంగాణాలో సైతం ఆర్టీసీ నష్టాల బాటలో సాగుతుంది. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఇక తెలంగాణ సర్కార్ సైతం ఏపీ తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమా? లేక కార్మికుల డిమాండ్లపై చర్చకు కమిటీ వేయడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
పాత సెక్రటేరియట్ భవన కూల్చివేతపై నిర్ణయం
ఈరోజు జరగనున్న క్యాబినెట్ భేటీ లో సెక్రటేరియట్ ఖాళీ అయిన నేపథ్యంలో కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుత సచివాలయ శాఖల తరలింపు పూర్తయిన నేపథ్యంలో సమీకృత సచివాలయం కోసం ఆర్కిటెక్టులు 9 నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఇక వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతతో సహా.. కొత్త భవన నిర్మాణంపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. కూల్చివేతకు ఆర్ అండ్ బీ శాఖకు అనుమతి ఇవ్వనున్నారు.
10 కీలక అంశాలపై చర్చ ..
ఇక అంతే కాదు మొత్తం మంత్రివర్గ ఆమోదం పొందాల్సిన పది అంశాలపై చర్చ జరగనుంది. వీటిలో ఎక్కువ శాతం ఆర్థికశాఖ నుంచి వచ్చిన ఫైళ్లే అని తెలుస్తోంది. సాయంత్రం వరకు మరికొన్ని అంశాలు క్యాబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి అనుమతితో మరికొన్ని కీలక ఫైళ్లు కూడా అజెండాగా క్యాబినెట్ ముందుకు రానున్నాయి. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ, ఆర్టీసీ కార్మికుల సమ్మె, వైద్య రంగంలో మార్పులు, దసరా సందర్భంగా పలు కార్యక్రమాలు, 30 రోజుల కార్యక్రమంపై కూడా కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయస్సు 57 ఏళ్ళకు తగ్గింపుతో పాటు ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్ళకు పెంపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.