5వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ, 10 లక్షల పెన్షన్లు: కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలివే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో గురువారం రాత్రి సమావేశమైన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు
ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు. గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణం, ప్రజా సమస్యలపై కమిటీ వేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని భేటీలో నిర్ణయం.

తెలంగాణలో 5వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నిర్ణయం
రాష్ట్రంలో 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకుంది. అదే ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వికారాబాద్లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం. షాబాద్ లో బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.
ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం.

75 మంది ఖైదీల విడుదలకు కేసీఆర్ కేబినెట్ నిర్ణయం
ఇక, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు, ఆగస్టు 21 నిర్వహించ తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వినతులు రావడంతో ప్రత్యేక సమావేశాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video


తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక చర్చ
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ భేటీలో సమగ్ర చర్చ జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. కేంద్రం నిధులు తగ్గినా వృద్ధిరేటు నమోదు గమనార్హమని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర నోడల్ ఖాతాలు అనే కొత్త పద్ధతితో రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్ర జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితుల్లో కోతలు విధించారని, లేదంటే ఆదాయం పెరిగేదని, వృద్ధిరేటు 22 శాతం నమోదయ్యేదని తెలిపారు. సీఎస్ఎస్ లో 8 ఏళ్లలో రూ. 47,312 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో రైతు బంధుకు రూ. 58,024 కోట్లు ఇచ్చామని చెప్పారు.












Click it and Unblock the Notifications