Third Front: అదే ఫైర్..అదే జోష్: మరోసారి ఉద్యమ సారథిగా కేసీఆర్: ఈ సారి జాతీయ స్థాయిలో..!
హైదరాబాద్: థర్డ్ ఫ్రంట్. మూడేళ్ల కిందట విస్తృతంగా వినిపించిన పదం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రహిత రాజకీయ శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సాగించిన ప్రయత్నాలకు నిలువుటద్దం. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఛప్పున చల్లారిందా వేడి. కేసీఆర్ చేసిన థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలన్నీ తెరవెనక్కి వెళ్లిపోయాయి.

ఆ చట్టాలే కేంద్రబిందువుగా..
థర్డ్ ఫ్రంట్ గురించి దాదాపు అందరూ మరిచిపోయిన వేళ.. మరోసారి తెరమీదికి వచ్చింది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలను వ్యతిరేకిస్తోన్న తటస్థ రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి, థర్డ్ ఫ్రంట్ వైపు వారిని నడిపించడానికి కేసీఆర్ తనవంతు ప్రయత్నాలను ఇదివరకే చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమంటోన్న తటస్థ రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
కేసీఆర్ వ్యూహం ప్రకారం.. అన్నీ సవ్యంగా సాగి ఉంటే ఈ పాటికి దేశంలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటై ఉండేదనే అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యాన్ని సాధించడం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు గండి కొట్టినట్టయింది. టీఆర్ఎస్ కొద్దో, గొప్పో నష్టపోయింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు ఉండగా.. ఎనిమిది చోటే విజయాన్ని సాధించగలిగింది.

పుల్స్టాప్ పడినట్టు భావించినా..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సైతం తన ఓటుబ్యాంకును కోల్పోయింది. వామపక్ష పార్టీలదీ అదే పరిస్థితి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, తమిళనాడులో డీఎంకే మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని తట్టుకోగలిగారు. బీజేపీని నిలువరించగలిగారు. వాటితో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదనుకున్నారో.. ఏమో గానీ.. కేసీఆర్ తన ప్రయత్నాలను విరమించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు దాదాపుగా పుల్స్టాప్ పడినట్టేనని భావిస్తోన్న తరుణంలో.. ఆయన మరోసారి అదే వాదనను వినిపించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో నిరసనలు మిన్నంటాయో కొద్దిరోజులుగా చూస్తూ వస్తున్నాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఈ రెండింటి పట్లా వ్యతిరేకత వ్యక్తమైంది. నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో.. పోలీసులు కాల్పులు జరిపేంత వరకూ వెళ్లిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

బీజేపీయేతర ముఖ్యమంత్రులతో మంతనాలు..
దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను ఇదివరకే మాట్లాడానని అంటున్నారు కేసీఆర్. పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర నమోదును, జాతీయ పౌర రిజిస్టర్ను వెనక్కి తీసుకునేంత వరకూ విశ్రమించబోనని హెచ్చరిస్తున్నారు. దీనికోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ పోరాడుతానని చెబుతున్నారు. హైదరాబాద్లో 10 లక్షలమందితో బహిరంగ ప్రదర్శనను నిర్వహిస్తానంటూ ఆయన చేస్తోన్న హూంకరింపులు చూస్తోంటే.. చాలాకాలం తరువాత ఆయనలో మరోసారి ఉద్యమ నాయకుడు ప్రస్ఫూటిస్తున్నారు.
Recommended Video

వెంట వచ్చేదెవరు?
థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా.. కేసీఆర్ ఇదివరకే ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ), పినరయి విజయన్ (కేరళ), నవీన్ పట్నాయక్ (ఒడిశా), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే చీఫ్, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్లను కలిశారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి.. వారితో సమావేశం అయ్యారు. ఆ ప్రయత్నాలు అప్పట్లో బెడిసికొట్టినప్పటికీ.. ఈ సారి మాత్రం పట్టు వదలకూడదని భావిస్తున్నారు గులాబీ బాస్.












Click it and Unblock the Notifications