ఉద్యోగులను దిల్ ఖుష్ చేసేలా... పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన... అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వర్తింపు...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ వేదికగా 30శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని... టీఎన్జీవో ఉద్యోగ సంఘం,పీఆర్టీయూ నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనాతో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్లే వేతన సవరణ కాస్త ఆలస్యమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే పీఆర్సీపై లీకులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం... చెప్పినట్లుగానే ఎన్నికలు ముగిసిన వెంటనే దానిపై ప్రకటన చేయడం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా...
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మెరుగైన రీతిలోనే ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టామని కేసీఆర్ అన్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు,హోంగార్డులు,అంగన్వాడీలు,ఆశా వర్కర్లు,విద్యా వాలంటీర్లు,వీఆర్ఏ,వీఏవో,సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ 12 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించనున్నామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఆ బకాయిలు అందజేస్తామన్నారు.అలాగే ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

వయోపరిమితి,ప్రమోషన్లు,ఉపాధ్యాయ పోస్టులపై కీలక నిర్ణయాలు...
ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞుల సేవల ఉపయోగానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని... ఇది తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం ప్రమోషన్లు పూర్తయిందని, మిగతా ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేస్తుందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న 10 వేల ప్రధానోపాధ్యాయుల సంఖ్యను మరో 10వేలకు పెంచేలా పోస్టుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.ఈహెచ్ఎస్ నూతన విధి విధానాలు నిర్ణయించేందుకు ప్రభుత్వ,ఉద్యోగ సంఘాలతో సంయుక్త కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.

భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చేలా...
వేర్వేరు జిల్లాలో పనిచేస్తున్న బార్యాభర్తలకు ఒకే జిల్లాలో పనిచేసేలా వీలు కల్పించేందుకు బదిలీలు చేపడుతామన్నారు. వీలైతే ఒకే యూనిట్లో... ఒకే మండలంలో ఇద్దరికీ పోస్టింగులు ఇచ్చేలా బదిలీలు ఉంటాయన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పోషించిన పాత్ర మరువలేనిది అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనూ 'తెలంగాణ' నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరుతోనే వారు పనిచేశారని గుర్తుచేశారు. పీఆర్సీపై సీఎం ప్రకటన చేసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications