తమిళనాడు ఎన్నికలు... బీజేపీకి నిధులు సమకూరుస్తున్న కేసీఆర్... రేవంత్ సంచలన వ్యాఖ్యలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చాక టీఆర్ఎస్ రాజకీయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి కేంద్రంపై సమరశంఖం పూరిస్తానని ప్రకటించిన కేసీఆర్... ఢిల్లీ నుంచి రాగానే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రంపై విమర్శలు,ఆరోపణలను ఆ పార్టీ నేతలు పక్కనపెట్టేశారు. పైగా వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేంద్రానికే జై కొట్టారు. ఇవన్నీ పక్కనపెడితే... ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించినా అధికార పార్టీ ఉలుకూ,పలుకూ లేకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే ఈ మౌనం వెనుక ఆంతర్యం వేరే ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అంటున్నారు...
రేవంత్ సంచలన వ్యాఖ్యలు...
తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్-బీజేపీ మధ్య దోస్తీ గురించి వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా నియమించడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి బీజేపీకి మోకరిల్లిన కేసీఆర్... ఇప్పుడు తమిళనాడు ఎన్నికల కోసం ఆ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని... ఇందుకోసం తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులను సైతం తమిళనాడులో పెట్టారని ఆరోపించారు.
తమిళనాడులో తెలంగాణ ఇంటలిజెన్స్ : రేవంత్
తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు తమిళనాడులో ఉన్నారా లేదా అన్నదానిపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని పదేపదే మాట్లాడిన బండి సంజయ్ ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మోదీతో ఆయనకు ఒప్పందం కుదిరిందన్నారు. కేసుల పేరుతో మోదీ హెచ్చరించడంతో కేసీఆర్ లొంగిపోయారని... ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి సహాయ,సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఆటలో అరటిపండు వంటి వాళ్లని విమర్శించారు.
Recommended Video
అంతుచిక్కని కేసీఆర్ మౌనం...
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. బడ్జెట్లో తెలంగాణను పట్టించుకోక పోయినా టీఆర్ఎస్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం... కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుండటం... ఇవన్నీ గమనిస్తే టీఆర్ఎస్-బీజేపీ మధ్య నిజంగానే దోస్తీ కుదిరిందా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక బీజేపీ నేతలు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లెవరూ కేసీఆర్తో పొత్తు పెట్టుకోరని అంటున్నారు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ చర్చకు ఊతమిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తరహాలోనే... గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ టీఆర్ఎస్పై కొన్ని ఆరోపణలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి కేసీఆర్ నిధులు సమకూర్చారని... దేశమంతా ఆ పార్టీ విస్తరించేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని విమర్శలు,ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసీఆర్ మాత్రం దేనిపై స్పందించకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ మౌనం వెనుక ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.