హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ: కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కేంద్రమంత్రి ముందు ఉంచారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు.
గతంలో ఉన్న 9 పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీసు కమిషనరేట్లు రెండు నుంచి తొమ్మిదికి, నాలుగు పోలీసు జోన్లు ఏడుకి పెరిగాయని హోంమంత్రికి కేసీఆర్ వివరించారు. పోలీసు మల్టీ జోన్లు రెండు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఎస్పీలు, కమిషనర్లు, జోన్ ఐజీల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు.

సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా, శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు.
ప్రధానికి అందించిన లేఖలు:
1. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.
2. రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
3. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
4. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
7. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
8.కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
9. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
10. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.అనే అంశాలకు సంబంధించిన లేఖలున్నాయి.
ఈ భేటీ సందర్భంగా... ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ 'తెలంగాణ భవన్' నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.
తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించండి:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం "తెలంగాణ భవన్" నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానం:
Recommended Video
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా, సీఎం కేసిఆర్ ప్రధానిని ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications