కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్తో సీఎం కేసీఆర్ భేటీ-రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణకు నష్టం జరుగుతోందని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల్లో నీటి పంపిణీపై ఈ సందర్భంగా కేంద్రమంత్రితో కేసీఆర్ చర్చించారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్నగర్ జిల్లాకు తీరని నష్టం జరుగుతోందని తెలిపారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు నీటి కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ),గోదావరి యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలును ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రమంత్రిని సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.

కృష్ణా జలాలు,కృష్ణా నదిపై ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండే తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు చేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు పడుతోంది.ఆంధ్రప్రదేశ్తో సమానంగా 50:50 నిష్పత్తిలో జలాల పంపిణీకి డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న సంగమేశ్వర ప్రాజెక్టు,పోతిరెడ్డిపాడు విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఏపీ మాత్రం ఇవి కొత్త ప్రాజెక్టులేమీ కాదని చెబుతోంది.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి,కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు అక్రమమని ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులేనని... కొత్తగా చేపట్టినవి కాదని చెబుతూ వస్తోంది. ఎవరికి వారు తమ వాదనే సరైనదనే ధోరణితో ఉన్నారు. దీంతో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్... ఈ నెల 26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంపై చర్చిస్తారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్కు తిరిగివస్తారు. సీఎంతో పాటు సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు సైతం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
హాట్ టాపిక్గా కేసీఆర్ ఢిల్లీ పర్యటన :
ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. దాదాపు 9 రోజులు అక్కడే ఉన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనతో పాటు పలువురు కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. తాజాగా మరోసారి కేసీఆర్ ఢిల్లీ బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ,టీఆర్ఎస్ ఒక్కటేననే సంకేతాలిచ్చేందుకే కేసీఆర్ బీజేపీ అగ్ర నేతలతో భేటీ అవుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.హుజురాబాద్ ఓటర్లను గందరగోళపరిచేందుకే.. కేసీఆర్ ఢిల్లీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వంగి వంగి దండాలు పెట్టి... బయటకు వచ్చి బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోతుందనే సంకేతాలు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్తో తాము కలిసే ప్రసక్తే లేదన్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ తాజా ఢిల్లీ టూర్ వెనుక ఎలాంటి రాజకీయం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతుండటం గమనార్హం.
Hon'ble CM Sri K. Chandrashekar Rao called on Hon'ble Union Minister for Jal Shakti Sri @gssjodhpur Ji in New Delhi today. pic.twitter.com/HFPu2pCZ4A
— Telangana CMO (@TelanganaCMO) September 25, 2021












Click it and Unblock the Notifications