ఏమో.. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చూడొచ్చారు?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు? ఆయన అసలు లక్ష్యం ఏమిటి? నిర్ణయం తీసుకోవడానికి ఉన్న బలమైన కారణాలేంటి? జాతీయ పార్టీద్వారా ఎటువంటి రాజకీయం చేయబోతున్నారు? ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అంటూ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది.
మోడీ-షా ద్వయంపై నిప్పులు
అనుకోకుండా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అది పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పై దృష్టి కేంద్రీకరిస్తారా? లేదంటే ఇంకా ఆలస్యం చేస్తారా? అనే కొత్త సందేహం ఇప్పుడు రాజకీయవర్గాలను తొలిచేస్తోంది. కేసీఆర్ ప్రధాన టార్గెట్ భారతీయ జనతాపార్టీతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా. వీరి వ్యవహారశైలిపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు.
ఎవరో ఒకరు, ఏదో ఒకటి చేయకపోతే దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఉండదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఆ ఎవరో వస్తారని ఎదురుచూసే బదులు తానే అడుగు ముందుకు వేయాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారిని నిలవరించాలని నిర్ణయించారు.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల చీలికపై దృష్టి!
ప్రస్తుతం మోడీ-షా ద్వయం దేశంలో బలమైన నేతలుగా ఉన్నారు. వీరిని ఎదిరించాలంటే అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలి. ప్రాంతీయ పార్టీల్లో ఐకమత్యం లేదు. ఎన్నికల తర్వాత అందరినీ ఒక గొడుకు కిందకు తీసుకురావాలంటే తలకు మించిన భారమవుతుంది. ఈ తరుణంలో జాతీయ పార్టీగా ప్రాధాన్యం దక్కించుకోవడంతోపాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటున్న వర్గాల్లో చీలిక తెస్తే పని సులువవుతుందని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ద్వారా బీజేపీ ఓట్లను చీల్చడానికి ఆయన వ్యూహం రూపొందించుకున్నారు. అందుకు ఆయా రాష్ట్రాల్లోని ఉప ప్రాంతీయ పార్టీలు, రైతు నాయకుల మద్దతు తీసుకోబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
రాజకీయ వ్యూహంలో దిట్ట!
ప్రస్తుతం రెండుసార్లు ముఖ్యమంత్రి తెలంగాణను అభివృద్ధి చేశానని భావిస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో రాజకీయ శూన్యత ఉందని అభిప్రాయపడుతున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఆయన జాతీయ రాజకీయాలంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ వ్యూహాన్ని అమలుపరచడంలో కేసీఆర్ కు గండర గండడు అనే పేరుంది. జాతీయ పార్టీద్వారా బీజేపీని నిలవరించే ప్రయత్నంలో ఆయన విజయం సాధించవచ్చని, కేసీఆర్ అదృష్టం ఎలా ఉందో ఎవరు చూడొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.