చెస్ ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలకు సీఎం రేవంత్ నజరానా
చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సీఎం అభినందించారు.
స్వర్ణ పతక విజేతలు అర్జున్, ద్రోణవల్లి హారికలకు రూ. 25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చెస్ విజేతలను అభినందించారు.

కాగా, ఇటీవల హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ లో టైటిల్ కోసం 190కిపైగా దేశాలు పోటీ పడ్డాయి. ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లతో తలబడిన భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాయి. భారత్ గతంలో 2014, 2022 రెండు ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ లలోనూ కాంస్యం సాధించింది.
ఆ తర్వాత కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020, 2021లో పోటీలను వర్చువల్ గా నిర్వహించారు. 2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్ స్వర్ణం సాధించింది. ఇక, 2021లో భారత్ కాంస్యం అందుకుంది. అయితే, వర్చువల్ గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఈసారి స్వర్ణం గెలిచిన భారత్ కు అధికారికంగా ఇదే తొలి బంగారు పతకం అయ్యింది.
తాజాగా జరిగిన 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్లో డీ గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్ను గుకేశ్ ఓడించగా, జాన్ సుబెల్జ్పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు. దీంతో వీరందరికి స్వర్ణం ఖాయమైంది.
ఇది ఇలావుండగా, 45 ఫిడే పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. 11వ రౌండ్లో 3.5-0.5 తో అజర్బైజాన్పై గెలుపొందింది. ద్రోణవల్లి హారిక - దివ్య దేశ్ముఖ్ తమ తమ గేమ్లలో విజయం సాధించగా, ఆర్ వైశాలి గేమ్ను డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఒకేసారి రెండు స్వర్ణ పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.












Click it and Unblock the Notifications