పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ కూడా నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని అధికారులు వివరించగా.. జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాంబరం కృష్ణమోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
చేనేత కార్మికుల ఉపాధిపై సీఎం రేవంత్ ఆదేశాలు
హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హ్యాండ్లూమ్, పవర్లూమ్లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా శక్తి గ్రూపు సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీపై చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications