తెలంగాణలోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు
హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఉమ్మడి బోర్డు ద్వారా జరగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుదీర్ఘ కసరత్తుల అనంతరం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డు కన్వీనర్గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి?తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది.

కాగా, తెలంగాణ రాష్ ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో దాదాపు 1000కిపైగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వైద్య విశ్వవిద్యాలయం(మెడికల్ యూనివర్సీటీ) మినహా మిగతా 12 వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టనున్నారు.
ఒక్కో యూనివర్సిటీలో వేర్వేరుగా నియామకాలు చేపడితే.. కొన్నింటిలో ఖాళీలు ఏర్పాడుతున్నాయి. ఒకే అభ్యర్థి వివిధ యూనివర్సిటీలకు పోటీపడుతున్నారు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలినవి వదిలేస్తున్నారన్న అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. బీహార్ తదితర రాష్ట్రాల్లో నియామకాలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించిన తర్వాత తెలంగాణలో కూడా నియామకాలకు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బోర్డు విధి విధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేయనున్నారు. కాగా, విశ్వవిద్యాలయాల్లో 3500 బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.