గవర్నర్, 'టీ' కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపిన రాష్ట్రపతి విందు
హైదరాబాద్: రాష్ట్రపతి విందు కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ నేతలు, గవర్నర్ నరసింహాన్ మధ్యల మాటల యుద్ధాన్ని రాజేశాయి. ‘ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదు. ప్రొటోకాల్ను పాటించడం లేదు' అంటూ గవర్నర్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
గవర్నర్ తీరును నిరసిస్తూ రంజాన్ని పురస్కరించుకుని ఆయన ఇచ్చే ఇఫ్తార్ విందుకు వెళ్లకూడదని తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ బుధవారం గాంధీ భవన్లో నిర్ణయించింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జూన్ 30న గవర్నర్ రాష్ట్రపతికి ఇచ్చిన విందుపై చర్చించారు. ఈ విందుకు ప్రతిపక్ష నేత జానా రెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీకి, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్కు ఆహ్వానాలు అందలేదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పాటు హకీంపేట ఎయిర్పోర్టులో రాష్ట్రపతిని ఆహ్వానించే కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ నేతలను పిలవలేదని ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. గవర్నర్ ప్రొటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు. ఆయన వైఖరికి నిరసనగా ఈ నెల 10న గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు వెళ్లకూడదని సమావేశంలో నిర్ణయించారు.
ఇఫ్తార్ విందుకు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదని, వచ్చినా వెళ్లకూడదని, తమ నిరసనను వ్యక్తం చేస్తూ గవర్నర్ నరసింహన్కు ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీల తరఫున లేఖ రాయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications