జగన్ పంథాలో తెలంగాణ కాంగ్రెస్: కెసిఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం
హైదరాబాద్: ఫిరాయింపులకు బ్రేకులు వేయడానికి, ఇప్పటికే ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే దిశగా నడిపించడానికి తెలంగాణ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పంథాను తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తోంది.
కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో మాదిరిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై ఇతర పార్టీలతో చర్చించి బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించలేమని తెలిసి కూడా జగన్ ఫిరాయింపులను కట్టడి చేసి, ఇప్పటికే ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించడానికి జగన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.
టిడిపిలో చేరిన 8 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు జగన్ స్వయంగా అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శాసనసభలో చెప్పారు. టిడిపికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి 8 మంది శాసనసభ్యులు ఫిరాయించారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆ ఎనిమిది సభ్యులు కూడా సభకు హాజరు కాలేదు.
అదే రీతిలో కాంగ్రెసు పార్టీ కెసిఆర్ ప్రభుత్వం విషయంలో అనుసరించాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తునన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసుకు చెందిన 4గురు శాసనసభ్యులు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు పార్టీ కోరినప్పటికీ స్పీకర్ మధుసూదనాచారి ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు.
అదే సమయంలో వరుసగా టిడిపికి చెందిన 12 మంది శాసనసభ్యులు తెరాసలో చేరారు. టిడిఎల్పీని చీల్చి, తెరాసలో విలీనం చేశామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేసిన కెసిఆర్ ఇక కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించే పనికి పూనుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తోంది.