మా పేర్లేవంటూ దత్తన్న ఆగ్రహం: ఎంపీ ల్యాడ్స్పై సీఎస్ వివరణ
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతాల అభివృద్ధి నిధుల పథకం(ఎంపీ ల్యాడ్స్) కింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఆదేశించారు. అంతేగాక, ఎంపీ ల్యాడ్స్తో చేపట్టిన పనులను అన్ని జిల్లాల కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఎంపీలతో సమీక్ష
మంగళవారం సీఎస్ అధ్యక్షతన ఎంపీల్యాడ్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు బండారుదత్తాత్రేయ, జితేందర్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, రోడ్లు, భవనాల ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, పురపాలక కార్యదర్శి నవీన్మిత్తల్ పాల్గొన్నారు.
నిధుల వినియోగంపై..
ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఎంపీల్యాడ్స్ మంజూరయ్యాక సంవత్సరంలోపు పనులు పూర్తి కావాలన్నారు. లోక్సభ సభ్యులకు సంబంధించి రూ. 253 కోట్ల విలువ గల 8,941 పనులు మంజూరు కాగా, రూ.166 కోట్ల విలువైన 6,322 పూర్తయ్యాయని చెప్పారు. రాజ్యసభ సభ్యులకు సంబంధింంచి రూ.140 కోట్ల విలువైన 3,968 పనులు మంజూరు కాగా రూ. 95.29 కోట్ల విలువైన 2,902 పనులు అయ్యాయని ఆయన వివరించారు.
దత్తన్న ఆగ్రహం
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ సహా పలువురు ఎంపీలు కలెక్టర్లపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్లు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండానే పనులు ప్రారంభిస్తున్నారని, శిలాఫలకాల్లో తమ పేర్లు ఉండటం లేదన్నారు. పనుల మంజూరుకు జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. కాగా, వీటన్నింటిని సరిజేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీల్యాడ్స్ తెలుగు మార్గదర్శకాల పుస్తకాన్ని విడుదల చేశారు.
ప్రొటోకాల్ పాటించాల్సిందే..
పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. హైదరాబాద్ పరిధిలోని పనుల మంజూరు ప్రక్రియలో మార్పు కోసం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎంపీ ల్యాడ్స్ పనుల కోసం 15 నోడల్ జిల్లాల్లో సహాయ కేంద్రాలను ప్రారంభించామన్నారు. అంతేగాక, ప్రారంభోత్సవాలు ఇతర కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలన్నారు.
స్వచ్ఛ సేవా..
పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించేందుకు అత్యధిక నిధులు వెచ్చించనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఏ బస్తీ, పాఠశాలల్లో సమస్య ఉందో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ యువ మోర్చా గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్నగర్లోని వీధి నం.11లో ‘స్వచ్ఛత హీ సేవా' నిర్వహించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ..మరుగుదొడ్ల సమస్య పట్టణాల్లోనూ ఉందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, మురికవాడల్లో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. తన ఎంపీ నిధుల్లోంచి అత్యధికంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికే కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.