Degree చదవాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే! పెను మార్పులు
తెలంగాణలో డిగ్రీ విద్యను మరింత క్రమబద్ధీకరించే దిశగా ఉన్నత విద్యామండలి కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రవేశ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు జరపాలని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 826 కళాశాలలు 'దోస్త్' (DOST) పోర్టల్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తుండగా, మరో 70 ప్రైవేట్ కళాశాలలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా అడ్మిషన్లు జరుపుకుంటున్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ 'నాన్-దోస్త్' తంతుకు చెక్ పెట్టాలంటే ప్రవేశ పరీక్ష ఒక్కటే మార్గమని విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అభిప్రాయపడ్డారు.

2027-28 విద్యా సంవత్సరం నుంచి అమలు?
ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2026-27) సమయం తక్కువగా ఉండటంతో, యధావిధిగా 'దోస్త్' ద్వారానే ప్రవేశాలు జరగనున్నాయి. అయితే, వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి విధివిధానాలను రూపొందించి, 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల అడ్డగోలు ప్రవేశాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.
డిమాండ్ లేని కోర్సులకు స్వస్తి!
ప్రస్తుతం దోస్త్ పరిధిలో ఉన్న 3.77 లక్షల సీట్లలో కేవలం 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. దాదాపు 60 శాతం సీట్లు ఖాళీగా ఉంటుండటంతో పాటు, 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, 'జీరో అడ్మిషన్లు' ఉన్న కోర్సులను మరియు కళాశాలలను రద్దు చేసేందుకు కూడా విద్యాశాఖ సిద్ధమవుతోంది.
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే, రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలన్నీ ఒకే తాటిపైకి రావడమే కాకుండా, విద్యార్థులకు పారదర్శకమైన ప్రవేశాలు లభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications