స్పీడందుకున్న నామినేషన్ల పర్వం; ఎర్రబెల్లి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి నామినేషన్ల దాఖలు!!
తెలంగాణ శాసనసభ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈరోజు మంచి రోజు కావడంతో ఎన్నికల బరిలోకి దిగిన పలువురు ముఖ్యమైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల నామినేషన్ల వేగం పుంజుకుంది. ఈరోజు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో, సహా పలువురు ప్రముఖులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి, బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు ఈరోజు తమ మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. తమ అనుచరులతో కలిసి తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి రిటర్నింగ్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు తొలి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

అంతకముందు మంత్రి ఎర్రబెల్లి ప్రతి శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు తమ ఆనవాయితీ ప్రకారం భార్య ఉషా దయాకర్ రావు తో కలిసి హనుమకొండలో గల హనుమాన్, సాయిబాబా ఆలయాలు, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం, తమ ఇంటి ఇలవేల్పు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తొర్రూరు దర్గా, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
బిజెపి జాతీయ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బండి సంజయ్ నామినేషన్ నేడు దాఖలు చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి నామినేషన్ పత్రాలు సమర్పించడానికి కరీంనగర్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న బండి సంజయ్ కేవలం 5గురు మాత్రమే లోపలికి వెళ్లాలానే నిబంధనతో స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ రిటర్నింగ్ కార్యాలయం వద్దకు వెళ్లారు. కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కె మహేశ్వర్ కు బండి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అంతకు ముందు కరీంనగర్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా బండి సంజయ్ తో కలిసి రాజాసింగ్ మాట్లాడుతూ బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. కరీంనగర్ లో పెద్దన్న బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు.
మీరు ఇక్కడి నుండే సంజయన్నను ఎంపీ చేసి పార్లమెంట్ కు పంపారు. ఇప్పుడు అసెంబ్లీకి పంపుతారని భావిస్తున్నట్లు రాజా సింగ్ తెలిపారు.మరోవైపు హెలికాప్టర్లో వెళ్లి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేశారు .భారీగా కార్యకర్తల నడుమ ర్యాలీగా వెళ్లిన రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications