Telangana elections: వర్ధన్నపేటలో వార్ వన్ సైడేనా!!
వర్ధన్నపేట నియోజకవర్గంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఓటరు నాడిని పట్టుకోవటం చాలా కష్టం. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఊహించని తీర్పును ఇచ్చిన ఈ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు చూస్తే తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కలప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2,60,555 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 1,28,722 మంది, మహిళా ఓటర్లు 1,31,818, ఇతరులు 15 మంది ఉన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. 2014 ఎన్నికలలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొండేటి శ్రీధర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగ పోటీ చేశారు. 86 వేల 349 ఓట్ల మెజారిటీతో ఆరూరి రమేష్ విజయం సాధించారు.

ఆ తర్వాత 2018 ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆరూరి రమేష్ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ టీజేఎస్ పొత్తులలో భాగంగా టీజేఎస్ నుండి పగిడిపాటీ దేవయ్య, బీజేపీ నుండి కొత్త సారంగారావు, సీపీఐ ఎంఎల్ నుండి చిలుమల్ల లెనిన్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ 99,240 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కే మళ్లీ టికెట్ లభించింది. వర్ధన్నపేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈయన హాయంలోనే జరగడం, ప్రతిపక్ష పార్టీల నుండి బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆరూరి రమేష్ కు కలిసి వచ్చే అంశం. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి నమిల్ల శ్రీనివాస్, సిరిసిల్ల రాజయ్య టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
అయితే ఇప్పటివరకు ఎవరు బరిలో ఉంటారా అనే విషయం కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవడం కూడా కాంగ్రెస్ శ్రేణులను సందిగ్ధంలో కి నెడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుడుగా ఉన్న కొండేటి శ్రీధర్ తరువాత పరిణామాల క్రమంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కొండేటి శ్రీధర్ వర్ధన్నపేట నియోజకవర్గం నుండి బీజేపీ నుండి పోటీలో ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తూ కొండేటి శ్రీధర్ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ స్థానికంగా పట్టు సాధించడానికి ఆయన కృషి చేస్తున్నారు.
అయితే అంగబలం, అర్ధబలం రెండు ఉన్న నేతగా ఆరూరి రమేష్ కు స్థానికంగా గట్టిపట్టు ఉండడంతో వచ్చే ఎన్నికలలో ఆరూరి రమేష్ తో పోటీ పడాలంటే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇక్కడ వార్ వన్ సైడే అన్న చర్చ కూడా సాగుతుంది.












Click it and Unblock the Notifications