అసెంబ్లీకి ముందే 4,000 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మొదలైన కసరత్తు
తెలంగాణలో అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది.
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు క్యాబినెట్ మంత్రులంతా అదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో భేటీ అయ్యారు.
మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నేతృత్యంలో ఈ సమావేశం జరిగింది. సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరపాలని ఇందులో నిర్ణయించారు.
పాత జిల్లాల వారీగా పదవుల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే దాదాపు 4 వేల నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించినా డైరెక్టర్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. వాటితోపాటు జిల్లా స్థాయిలో పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు తప్ప జిల్లాల్లో ఇతర పోస్టులను భర్తీ చేయలేదు.
దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీలతోపాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులకు ఇప్పుడు ఎంపిక జరగనుంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, శాప్, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్లలో పోస్టులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు.