Telangana Municipal Election: మహిళలకే పుర పాలన.. రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణలో పుర పాలనకు కీలకమైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అధికారికంగా ప్రకటించారు. రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మీడియాతో మాట్లాడిన శ్రీదేవి.. మొత్తం 121 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో 5 స్థానాలు ఎస్టీలకు, 17 ఎస్సీలకు, 38 బీసీలకు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో స్థానిక పాలనలో మహిళల పాత్ర మరింత బలపడుతుందని ఆమె స్పష్టం చేశారు.

కార్పొరేషన్ల వారీగా చూస్తే.. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను ఎస్టీ జనరల్కు కేటాయించగా, రామగుండం కార్పొరేషన్ను ఎస్సీ జనరల్కు రిజర్వ్ చేశారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ మహిళలకు దక్కగా, మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లు బీసీ జనరల్ కేటగిరీలోకి వెళ్లాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మహిళా జనరల్గా ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహిళా నాయకత్వం మరింత బలోపేతం..
అలాగే గ్రేటర్ వరంగల్ను జనరల్ కేటగిరీకి కేటాయించగా, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను మహిళా జనరల్ రిజర్వేషన్లో చేర్చారు. ఈ నిర్ణయాలతో ఆయా నగరాల్లో మహిళా నాయకత్వం మరింత బలోపేతం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు.
కొత్త వారికి అవకాశం..!
రిజర్వేషన్ల ఖరారుతో ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి అభ్యర్థుల ఎంపికపై పడింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ ఎక్కువగా ఉండటంతో కొత్త ముఖాలకు అవకాశం లభించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సామాజిక వర్గాల వారీగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ రిజర్వేషన్లలో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణ పట్టణ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రిజర్వేషన్ల ప్రకటనతో మేయర్, ఛైర్పర్సన్ పదవుల కోసం రాజకీయ సమీకరణలు వేగం పుంజుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపించనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications