కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళల మృతి ఘటన: తెలంగాణా సర్కార్ సీరియస్; చర్యలు షురూ!!
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. ఆపరేషన్లు వికటించి మహిళలు మృతి చెందిన ఘటనపై విచారణ జరిపిన సర్కార్ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆపరేషన్ చేసిన డాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చెయ్యటంతో పాటు, సంబంధిత అధికారులపై బదిలీ వేటు వేసింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై చర్యలు షురూ
రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, డీసిహెచ్ఎస్ ఝాన్సీలపై బదిలీ వేటు వేసింది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే సస్పెండైన ఇబ్రహీంపట్నం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారికి రంగారెడ్డి డీసిహెచ్ఎస్ గా అదనపు బాధ్యతలుఅప్పగించింది. వీరితోపాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.
ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం
బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అనేక మార్గదర్శకాలను కూడా సూచించింది వైద్యారోగ్యశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన మార్గదర్శకాలను చూస్తే ఆసుపత్రుల సేవల్లో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని పేర్కొంది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్ణయించిన రోజులలో మాత్రమే చేయాలని, ఆపరేషన్ చేసిన తరువాత 24 గంటల పాటు తప్పనిసరిగా అబ్జర్వేషన్లో ఉంచాలని పేర్కొంది. నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం ఆపరేషన్ చేసుకునేవారు, వారికి ఇష్టం ఉన్న రోజుల్లో రావచ్చని వెల్లడించింది. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన పేషెంట్ ని సంబంధిత ఆసుపత్రి సూపర్వైజర్ 24 గంటల్లో ఒకసారి, వారంలోగా మరో రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలని పేర్కొంది.
కు.ని ఆపరేషన్లు చేయించుకున్న మహిళల ఆరోగ్యంపై అబ్జర్వేషన్ తప్పనిసరి
సంబంధిత పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలో ఆపరేషన్ చేయించుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. పేషెంట్ ను సంబంధిత సూపర్వైజర్ మానిటర్ చేస్తున్నారా లేదా అనేది జిల్లా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలని వెల్లడించింది. ఇక ఇదే సమయంలో ప్రి ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్, డీపిఎల్ క్యాంపు ఆఫీసర్ చూసుకోవాలని వెల్లడించింది.
నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని 30కి మించి ఆపరేషన్లు చెయ్యరాదు
ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తు పట్టే విధంగా సూపర్ వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలని పేర్కొంది. ఏడాదికి ఒకసారి డీపీఎల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. కమిషనర్ ఆఫీసు లోని రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్ మీద కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరపాలని తెలిపింది. నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒక రోజులో 30 కి మించి ఆపరేషన్లు చేయరాదని సూచించింది.
ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, నర్సులకు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్ ఆస్పత్రిలో శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. ఆయా ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ చైర్మన్ లుగా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలని తెలిపింది. ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు పాటించేలా డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ చూసుకోవాలని వెల్లడించింది. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల పై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.