మేడారం జాతరపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం..!
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర నిర్వహణ పనులను రోడ్లు-భవనాల శాఖకు బదిలీ చేసింది. దేవదాయశాఖకు ఈ పనులను పర్యవేక్షించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల కోసం మౌలిక సదుపాయాలతో పాటు గద్దెలు, ప్రాకారాన్ని తిరిగి నిర్మించనుంది. కాగా గత నెల 24న రెవెన్యూ (దేవదాయ) శాఖ గద్దెలు, ప్రాకారం గోడల నిర్మాణానికి రూ.101 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు రోడ్ల పనులను కూడా ప్రారంభించింది. ఆ తర్వాత, రోడ్లు-భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఛైర్మన్గా ఒక సాంకేతిక కమిటీని నియమించింది.

ఇక ఈ కమిటీ టెండర్లను ఆహ్వానించి, ఈ నెల పదో తేదీన వాటిని స్వీకరించింది. ఇప్పటివరకు ఈ పనుల బాధ్యత దేవదాయశాఖదే అయినప్పటికీ.. పనుల స్వభావం, సాంకేతిక అంశాలు, నాణ్యత, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణంతో సహా మొత్తం పనులను రోడ్లు-భవనాల శాఖకు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న దశ నుంచే పనులను స్వాధీనం చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు సూచించగా, ఈ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే అప్పగించాలని దేవదాయ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరలో దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ జాతరను "దక్షిణ భారత కుంభమేళా" అని కూడా పిలుస్తారు. వచ్చే ఏడాది జనవరి చివర్లో కూడా ఈ జాతర ఘనంగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర వైభవంగా జరగనుంది.
జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోనున్నారు. జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు విపరీతంగా తరలి వచ్చి బంగారం, వెండి, జుట్టు, కోడిపుంజులు, తేనె, చెల్లింపు డబ్బులు వంటి విభిన్న రకాల మొక్కులు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications