ముద్రగడ 'కాపు' ఎఫెక్ట్: కెసిఆర్కూ రిజర్వేషన్ సెగ, ప్లాన్ చేస్తున్నారు
హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేడి రాజేస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు అంశం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా రిజర్వేషన్ల సెగ తగలనుందని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో.. కాపులను బీసీలలో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ కోసం ఏపీలో కాపు వర్గం ఉద్యమిస్తోంది. చంద్రబాబులాగే తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా మైనార్టీలకు 12 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇరు వర్గాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వర్గాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతుగా నిలబడనున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ముస్లీంలకు నాలుగు శాతం, ఎస్టీలకు 7.5 శాతం కోటా ఉంది. తమ హామీల పైన కెసిఆర్ ప్రభుత్వం కమిషన్ వేసింది. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటి వరకు మరో పురోగతి లేదు. కాపులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు కమిషన్ వేశారు. దానికి తొమ్మిది గడువు కూడా ఉంది. అయినప్పటికీ ఏపీలో కాపు హీట్ పెరిగింది.
ఇప్పుడు కెసిఆర్ కమిషన్ వేసినప్పటికీ మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల పైన పోరుకు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు ఈ విషయమై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నుంచి ఉద్యమం లేవనెత్తాలని కాంగ్రెస్ మైనార్టీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమం సమయంలో 2009 నుంచి 2014 వరకు కెసిఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నారు. అంతేకాదు, అతను షాద్ నగర్ ఎన్నికల ప్రచారంలోనే తొలిసారి రిజర్వేషన్ల ప్రకటన చేశారు.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం షాద్ నగర్లో ఆమరణ దీక్షకు ప్లాన్ చేస్తున్నామని, ఇరవై నెలలు అయినా కెసిఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతి లేదని, ఆరు నెలల్లో కమిషన్ నివేదిక ఇవ్వాల్సినప్పటికీ ఇప్పటికీ ఇవ్వలేదని, మరెంతో కాలం మేం ఆగలేమని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.