ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..!!
హైదరాబాద్: విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొన్నింటిని ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటి మొత్తం విలువ 10,500 కోట్ల రూపాయలు. విశాఖపట్నం చేపలరేవు ఆధునికీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఆరులేన్ల జాతీయ రహదారి పనులు, పోర్ట్ కనెక్టివిటీ కోసం అదనంగా నాలుగు లేన్ల డెడికేటెడ్ పోర్ట్ రోడ్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్ సభలో..
అనంతరం ఆయన తెలంగాణ పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్ బేగంపేట్లో దిగారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఆయన ప్రసంగం మొత్తం కేసీఆర్ సర్కార్ను విమర్శించడంపైనే కేంద్రీకృతమై కనిపించింది. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్నీ ఆయన ప్రస్తావించారు.

ఎంతో నమ్మకంతో..
మునుగోడు ప్రజలు భారతీయ జనత పార్టీపై విశ్వాసాన్ని ప్రదర్శించిన తీరు అపూర్వమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తాన్నీ బీజేపీ కార్యకర్తలు కదిలించారని ప్రశంసించారు. ఒక అసెంబ్లీ సీటు కోసం ప్రభుత్వం ఎలా వెంపర్లాడేలా చేశారో తాను చూశానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఇది నాంది పలికిందని పేర్కొన్నారు.

విసిగిపోయారు..
తెలంగాణ ప్రజలు ఎంతో విశ్వాసంగా రాజకీయ పార్టీకి అందలం ఎక్కించిందని, అలాంటి ప్రజలను అధికార పార్టీ అతి పెద్ద ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం వైఖరికి ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల మధ్య కమలం వికసించడం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చిక్కటి చీకటిని చీల్చుకుని కమలం వికసిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పీపుల్స్ ఫస్ట్..
తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ- అదే తెలంగాణను నిరంతరం దోపిడీ చేస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ఫ్యామిలీ ఫస్ట్ అనే సూత్రంతో పని చేస్తోందని మండిపడ్డారు. తాము మాత్రం పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తోన్నామని, ఈ రెండు పార్టీల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. తమ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని ఆరోపించారు. ఆవిర్భావం నుంచీ తెలంగాణ ప్రజలు దగాపడుతునే ఉన్నారని విమర్శించారు.

దోపిడీదారులను వదిలి పెట్టం..
తెలంగాణతో బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 1984 ఎన్నికల్లో తమ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుందని, అందులో ఒకటి హన్మకొండ అని గుర్తు చేశారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదుగుతోందని అన్నారు. కార్యకర్తల కృషి వల్లే బీజేపీకి లోక్సభలో 300కు పైగా సీట్లు వచ్చాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టబోమని తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications