తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వంలో మాదిరి ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలను పొందే విధంగా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు.
గతంలో మాదిరి ప్రజలు ఏ చిన్న పనికైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండానే దరఖాస్తు చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే పారదర్శకంగా కార్డు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని.. ఈ వ్యవస్థను రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలులో ఇటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వివరించారు.

అలాగే పేద ప్రజల సొంతింటి సాకారంపైనా పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వత నివాసాన్ని కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో వివిధ మార్గాలలో ఉపాధి పొందుతున్న పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వివరించారు. పేదల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని గృహ నిర్మాణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ త్వరలోనే సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా ఆర్థిక భరోసా కల్పించేలా పెన్షన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications