టెట్,డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్... ఆ రెండింటికీ ఈసారి ఒకే పరీక్ష ఉండే ఛాన్స్...?
తెలంగాణ ప్రభుత్వం త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని చెబుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునా.. బహుశా ఎన్నికల అనంతరం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో అత్యధిక ఉద్యోగాలు పోలీస్,టీచర్ పోస్టులే ఉండవచ్చునని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ కొలువుల భర్తీకి ప్రభుత్వం టెట్,డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈసారి రెండింటికీ కలిపి ఒకే పరీక్షను నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే అంశాన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించింది. ఇందులో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, ఓయూ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్,పలువురు విద్యాశాఖ అధికారులను సభ్యులుగా నియమించింది. టెట్,డీఎస్సీ వేర్వేరుగా నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతారని... ఎక్కువ సమయం కూడా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించనున్నారు. అనంతరం ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్లో చాలా కోచింగ్ సెంటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు టెట్,డీఎస్సీ కోచింగ్ సెంటర్లలో చేరి శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారు.
నిజానికి గతేడాది డిసెంబర్లోనే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన లీకులు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ప్రకటన రావొచ్చునని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందా... లేక నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసే వరకూ వేచి చూడక తప్పదా అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు.
కాగా,ఈ నెల 14న వరంగల్-ఖమ్మం-నల్గొండ,హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,రామచంద్రరావుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 17న వెల్లడికానున్నాయి.