కొలువుల జాతరపై కీలక అప్డేట్... వేగంగా కసరత్తు... ఆలోపే నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్?
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలివ్వడంతో ఆ దిశగా వేగంగా కసరత్తు జరుగుతోంది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో... ఎన్నికల కోడ్ అమలులోకి రావడం కంటే ముందే నోటిఫికేషన్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రతీరోజూ ఆయా శాఖల అధికారులతో సమావేశమై ఖాళీల వివరాలు,ఆ పోస్టుల భర్తీతో ప్రభుత్వానికి అయ్యే ఖర్చుపై చర్చిస్తున్నారు. శుక్రవారం(డిసెంబర్ 18) హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విద్యా,ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు.
న్యాయ నిపుణులతో సంప్రదింపులు...
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం సోమవారం(డిసెంబర్ 21) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో దాదాపు 20వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు ముందే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
విద్యాశాఖలో 12వేల పోస్టులు
రాష్ట్రంలో విద్యాశాఖలో ప్రస్తుతం 5వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... దాదాపు 12వేల పోస్టుల భర్తీకి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని విద్యా శాఖ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనుంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9వేల ఖాళీలు... 3వేల ఎస్జీటీ ఖాళీలు గుర్తించారు. వీటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. ఇందులో 70శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 30శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు.
క్లియర్ వేకెన్సీలపై తేలిన లెక్క
ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9వేల ఖాళీలు ఉన్నాయి. ఇందులో 2700 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. మిగతా 6300 పోస్టుల్లో అర్హత కలిగిన ఎస్జీటీ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా మొత్తం 9వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్ వేకెన్సీ పోస్టులపై ఇప్పటికే లెక్కలు తయారుచేసిన విద్యా శాఖ వీటిని ప్రభుత్వానికి పంపించే యోచనలో ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు..?
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ స్థానంతో పాటు ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుతో ఈ స్థానాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుంది. గడువుకు నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు మరో 2 వారాల సమయం పడుతుంది. ఈలోపు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాల ప్రక్రియను ప్రారంభించినట్లు ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.