చిరిగిపోతున్న జెండాలు: కేసీఆర్ ప్రభుత్వానికి భారంగా మారిన భారీ జెండా నిర్వహణ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నగరంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారిందా? అంటే అవుననే అంటున్నారు. 291 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జాతీయ జెండా తరచూ చిరిగిపోతుంది.
దీంతో ఇప్పటికే అధికారులు నాలుగు జెండాలను మార్చారు. జెండా ఖర్చు కూడా భారీ మొత్తంలో ఉండటంతో ఈ జాతీయ జెండా నిర్వహణ అధికారులకు కష్టంగా మారింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఈ జాతీయజెండాను సీఎం కేసీఆర్ రిమోట్తో పోల్పై ఆవిష్కరించారు. నగరంలోని అతి సువిశాలమైన ప్రదేశంలో ఈ జాతీయ జెండాను రెపరెపడాలించి యావత్ భారతజాతిలో దేశభక్తిని పెంపొందించారు. అంతేకాదు ఈ అతిపెద్ద జాతీయ జెండా ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది.
In PICS: సంజీవయ్య పార్కులో జాతీయ జెండా ఆవిష్కరణ
291 అడుగుల ఎత్తులు జాతీయ జెండా ఎగురుతుండటంతో పాటు దీనిని అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయితే హుస్సేన్ సాగర్కు అతి సమీపంలో ఉండటంతో తరచూ వీచే అతి బలమైన గాలులకు జెండా చిరిగిపోవడం అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
కేవలం 16రోజుల్లోనే నాలుగు జెండాలను అధికారులు మార్చారు. ఎక్కువ ఎత్తులో ఉండటంతో జెండా వేగంగా రెపరెపలాడటంతో ఏమూలన చిరిగినా గాలి వాటానికి అది పెద్దగా అవుతోంది. జూన్ 2న ఆవిర్భావ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు రోజులకే జాతీయ జెండా చిరిగిపోయిందని వార్తలు వచ్చాయి.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మరో జెండాను ఏర్పాటు చేశారు. ఇది కూడా మూడు రోజులకే చిరిగిపోయింది. తమ వద్ద ఉన్న మూడో జెండాను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 12వ రోజుకే చిరిగిపోయింది. దీంతో ఉన్న జెండాలన్నీ అయిపోవడంతో రెండు రోజులు పాటు జెండా పోల్ను ఖాలీగా ఉంచారు.
ఆ తర్వాత ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీ నుంచి తెప్పించిన జెండా పోల్పై ప్రస్తుతం ఎగురుతోంది. ఇది నాల్గవ జెండా. ఒక్కో జెండాను లక్షన్నర ఖర్చు చేసి తెప్పించినట్లు అధికారులు వెల్లడించారు. తొలుత ఏర్పాటు చేసిన మూడు జెండాలను తెలంగాణ ప్రభుత్వం ఖమ్మంలో తయారు చేయించింది.
ఆ తర్వాత ముంబై నుంచి మూడు జెండాలను ముంబై నుంచి తెప్పించింది. చిరిగిన జెండాను పోల్పై ఉంచడం మన దేశంలో నేరం. అంతేకాదు జెండా చిరగడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో జెండా చిరగడంపై ఢిల్లీలోని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేవి గిల్ను పలుమార్లు ఫోన్లో ప్రభుత్వం సంప్రదించింది.
దీంతో ఆయన గాలుల ప్రభావంతో జెండాలు చిరిగితే మాన్యుమెంట్ ఫ్లాగ్ కేటగిరీకి వస్తుందని దాని వల్ల కొద్దిరోజులు జెండాను తొలగించినా ఇబ్బందులు ఉండవని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు పోల్ను ఖాళీగా ఉంచి ఆ తరువాత నాలుగో జెండాను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ జెండా నిర్వహణ బాధ్యతలను ఆర్ అండ్ బి అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ జెండా నిర్వహణ భారం కావడంతో అధికారులు ఈ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించే యోచనలో ఉన్నారు. దీనిపై ఓ ప్రత్యేక కమిటీని వేసి జెండా నిర్వహణకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందిచనున్నారు.