సచివాలయం భవనాల కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: సచివాలయం భవనాల కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఇప్పుడున్న భవనాల్లోనే సచివాలయాన్ని కొనసాగించలేమంటూ తెలంగాణ ప్రభుత్వ వాదనతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించారు. ఇప్పుడున్న పరిస్థితులు, పరిపాలనకు అనుగుణంగా సచివాలయ భవనాలు లేవని, వాటిని కూల్చేసి, కొత్తవాటిని నిర్మించుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదన సరైనదేనని అన్నారు. కూల్చివేతకు నిరసనగా ఇదివరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేశారు. దీనిపై ఇదివరకు ఇచ్చిన స్టేను ఎత్తేశారు.
నల్లమల అడవుల్లో ఘోరం: అరిష్టం పేరుతో: గర్భిణీ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి: రెండ్రోజుల తరువాత
10కి పైగా పిటీషన్లు..
ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్బండ్ సమీపంలో లుంబినీ పార్కు ఎదురుగా కొనసాగుతోన్న పాత సచివాలయం భవనాన్ని కూల్చివేయాలంటూ ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నిరసించారు. కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను పోతోందని, దశాబ్దాల చరిత్ర ఉన్న సచివాలయం భవనాన్ని కూల్చివేయడాన్ని అడ్డుకోవాలని విజ్ఙప్తి చేశారు. పిటీషన్లను దాఖలు చేశారు. ఈ ఒక్క అంశంపై 10కి పైగా పిటీషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు తదితరులు ఈ పిటీషన్లను దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
ఎనిమిదిన్నర నెలల కిందట స్టే..
ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. పలు దశల్లో విచారణలను పూర్తి చేసింది. హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్టే ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన స్టే ఆదేశాలను జారీ చేసింది. అప్పటి నుంచీ సచివాలయం కూల్చివేత విషయంలో ఏ అడుగూ ముందుకు పడలేదు. స్టేను ఎత్తేయడానికి తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలను ఆరంభించింది. ఇందులో భాగంగా.. పలు కౌంటర్లను దాఖలు చేసింది.
బీఆర్కే భవన్లో
పాత సచివాలయం భవనాలను కూల్చివేయాలంటూ నిర్ణయాన్ని తీసుకున్న అనంతరం కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేసింది. పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్కు తరలి వెళ్లింది. ప్రస్తుతం బీఆర్కే భవన్ నుంచే తెలంగాణ ప్రభుత్వ సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా- సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. వెంటనే దాన్ని కార్యాచరణలోకి పెట్టబోతోంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం కావచ్చని తెలుస్తోంది. మూడు నుంచి ఆరు నెలల్లోగా భవనాలను కూల్చేయవచ్చని చెబుతున్నారు.
వాస్తుదోషమే ప్రధాన కారణం..
సచివాలయం పాత భవనాల కూల్చివేతకు ప్రధాన కారణం.. వాస్తుదోషం ఉందనే అభిప్రాయం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుల్లో వ్యక్తమౌతోంది. సచివాలయానికి వాస్తుదోషం ఉందని, కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి అక్కడి భవనాలు ఏ మాత్రం కలిసి రావనేది వారి వాదన. తెలంగాణ ఏపీ తరహాలోనే అభివృద్ధికి నోచుకోకపోవచ్చని, వివాదాలపాలు అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నారు. ఇదివరకు ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రి స్థలాన్ని కొత్త సచివాలయం నిర్మాణానికి పరిశీలించారు. ప్రస్తుతం ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నిర్దారించలేదని అంటున్నారు.