రేవంత్ రెడ్డి కేసు: సెలవులో నిన్న శివధర్ రెడ్డి, నేడు వెంకటేశం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి చెందిన ఓటుకు నోటు వ్యవహారంలో తెర వెనుక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు సెలవుపై వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నారు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ సజ్జనార్ కొన్నాళ్లపాటు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. తాజాగా, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈనెల 20న సెలవుపై వెళ్లారు. జూలై 9 వరకు ఆయన సెలవులోనే ఉంటారు.
శివధర్ రెడ్డి తిరిగి వచ్చాక హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా విదేశీ బాటపట్టనున్నట్లు సమాచారం. అధికారుల విదేశీ పర్యటనలపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవన్నీ ముందుగానే అనుకున్న పర్యటనలేనని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బుర్రా వెంకటేశానికి కూడా నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నలుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేయాలని సిట్ భావిస్తున్నట్లు ఉహాగానాలు చెలరేగుతున్నాయి.