ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్: అసెంబ్లీలో హాట్ టాపిక్పై మౌనం! ఎందుకో..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఏఏ అంశాలు చర్చకు వస్తాయనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల పైన సమావేశాల్లో ఏ పార్టీ కూడా చర్చకు పట్టుబట్టకపోవచ్చునని తెలుస్తోంది.
కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు డబ్బులు ఇస్తూ అరెస్టయ్యారు. దానికి ప్రతిగా ఏపీ.. కెసిఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. దీంతో కొద్ది రోజులు దీనిపై టిడిపి, టిఆర్ఎస్ మధ్య వాగ్యుద్ధం నడిచింది.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అనంతరం జరుగుతున్న సమావేశాలు కాబట్టి... దీనిపై అసెంబ్లీలో వాడిగా, వేడుగా చర్చ జరుగుతుండవచ్చునని అందరు భావిస్తున్నారు.
అయితే, ఓటుకు నోటు అంశాన్ని తెలంగాణలోని ఏ పార్టీ కూడా.. అధికార టిఆర్ఎస్ కూడా అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేయకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తొలి నాలుగు రోజుల సమావేశానికి 150 ప్రశ్నలకు గాను 40 ప్రశ్నలను ఎన్నుకున్నారు. అందులో ఫోన్ ట్యాపింగ్ లేదా ఓటుకు నోటు అంశాలు లేవు. అయితే, రైతు ఆత్మహత్యలు వంటి మెజార్టీ అంశాలు ఉన్నందునే పక్కన పెట్టి ఉంటారని తెలుస్తోంది.
ప్రశ్నల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేకపోవడంపై... కాంగ్రెస్ మహిళా నాయకురాలు డికె అరుణ, బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్లు స్పందించారు. ప్రశ్నల్లో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఎందుకు లేదో తమకు తెలియదని, వాటిని అందరు మర్చిపోయి ఉంటారని అభిప్రాయపడ్డారు.