కరోనా:స్టార్ హోటల్స్ స్పెషల్ ట్రీట్.. కేసీఆర్ వినూత్నం.. కేసులు పెరిగినా, స్ఫూర్తి తగ్గకుండా..
తెలంగాణలో కరోనా టెస్టింగ్స్ జోరుగా సాగుతుండటంతో కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే 14 కొత్త కేసులు వెలుగులోకిరాగా, అందులో 12 మంది హైదరాబాద్ కు చెందినవారే కావడం గమనార్హం. ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 872కి చేరింది. అందులో 186మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయిపోగా, 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 663గా ఉంది. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, స్ఫూర్తి తగ్గకుండా కరోనాతో పోరాడుతామన్న సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.
దేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో లేని విధంగా.. కొవిడ్-19 రోగులకు సేవలందిస్తోన్న వైద్య సిబ్బందికి స్టార్ హోటళ్లలో ప్రత్యేక బస ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు హైదరాబాద్ సహా పలు సిటీల్లోని హోటల్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నది. జాగ్రత్త చర్యల్లో భాగంగానే డాక్టర్లు, నర్సులను విడివిడిగా ప్రభుత్వ ఖర్చులతో హోటళ్లలో సేఫ్ గా ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
టెస్టింగ్స్ పెరిగే కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ ను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)గా అభివృద్ధి చేసింది. లక్ష కేసులు నమోదైనా అందరికీ ప్రభుత్వమే ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.