ఏపీ దారిలోనే.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు: బాలికలదే హవా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఏపీ వలే తెలంగాణ కూడా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది.
ఈ సందర్భంగా కడియం మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 62.70 శాతం ఉత్తీర్ణత ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 67.74, బాలుర ఉత్తీర్ణత శాతం 58గా ఉంది. సెకండియర్లో 63.32 శాతం ఉత్తీర్ణత ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 59గా, బాలుర ఉత్తీర్ణత శాతం 48గా ఉంది.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తుకు ఈ నెల 30వరకు ఉంటుందని చెప్పారు. ఇంటర్మీడియేట్లో పూర్తిగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మే 24న అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందని చెప్పారు.
కాగా, ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలికలదే పైచేయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,43,503 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.