సైబర్ నేరాల్లో, మానవ అక్రమరవాణాలో తెలంగాణా దేశంలోనే టాప్.. ఎన్సీఆర్బీ నివేదికలో షాకింగ్ నిజాలు!!
ఒకపక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది అని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంటే, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సైబర్ నేరాలలో, మానవ అక్రమ రవాణాలో, ఆహార కల్తీ కేసుల్లో తొలి స్థానంలో ఉందని ఎన్సిఆర్బి షాకింగ్ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన అనేక కేసుల పై 2021 సంవత్సరానికిగానూ రాష్ట్ర పరిస్థితిని వివరించిన ఎన్సీఆర్బీ ఆదివారం విడుదల చేసిన నివేదిక తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని కళ్లకు కడుతుంది.

ఎన్సీఆర్బీ నివేదికలో రాష్ట్రంలో నేరాలపై షాకింగ్ రిపోర్ట్
రాష్ట్రంలో 2019 లో 1,18,338 కేసులు, 2020లో 1,35,885 కేసులు, 2021లో 1,46,131 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు నమోదైతే దాదాపు 20 శాతం తెలంగాణ రాష్ట్రం లోనే కావడం గమనార్హం. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆర్థిక మోసాల కోణంలో జరిగిన సైబర్ నేరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాలోనూ తెలంగాణ తొలి స్థానంలో ఉంది. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన ఆర్థిక కేసుల్లో తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. ఇక వృద్ధులపై జరిగే దాడులలో మూడవ స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో రాష్ట్ర పరిస్థితి.

సైబర్ క్రైంలలో దేశంలోనే టాప్ లో తెలంగాణా
ఐటీ హబ్గా కూడా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు సైబర్ క్రైమ్ల ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా కూడా అవతరించిందని ఎన్సిఆర్బి నివేదిక పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం 2020లో దేశంలో జరిగిన మొత్తం సైబర్ మోసాలలో తెలంగాణ 10 శాతం మోసాలను నమోదు చేసింది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2020 నివేదిక ప్రకారం 2019లో 2,691 కేసులుండగా, తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 13.4 కేసుల చొప్పున 2020లో సైబర్ నేరాల సంఖ్య 5,024కి పెరిగింది. 2021లో తెలంగాణలో సైబర్ నేరాలు రెండు రెట్లు పెరిగాయి. ఏడాది కాలంలో మొత్తం 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణాలో నమోదవుతున్న సైబర్ నేరాల సరళి ఇలా
కస్టమర్ కేర్ మోసం, ప్రకటనల పోర్టల్ మోసం, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు మరియు బ్యాంకు సంబంధిత మోసాలు ప్రధాన నేరాలుగా వర్గీకరించబడ్డాయి. ఇతర నేరాలలో ఆన్లైన్ మోసాలు, సైబర్స్టాకింగ్, ఫిషింగ్ మరియు అసభ్యకరమైన కంటెంట్ ఉన్నాయి. పోలీసుల ప్రకారం, స్కామ్లలో చాలా వరకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) స్కీమ్లు ఉన్నాయి, ఇందులో మోసగాళ్ళు బాధితులను మోసం చెయ్యటానికి QR కోడ్లను స్కాన్ చేయమని మాయమాటలు చెప్పి డబ్బు పంపేలా చేసి వారిని మోసం చేస్తున్నారు.

ప్రతీ ఐదుగురిలో ఇద్దరు సైబర్ క్రైంల బారిన పడుతున్నట్టు గుర్తింపు
2020లో 1,379 కేసులు నమోదవగా, ఒక్క హైదరాబాద్ పోలీసులే 2021 వ సంవత్సరంలో 5,646 సైబర్ క్రైమ్ల కేసులు నమోదు చేశారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు సైబర్ క్రైం బారిన పడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ దాదాపు 100 ఎఫ్ఐఆర్లు నమోదు నమోదు అవుతున్నట్టు సమాచారం. వాటిలో 20 శాతం సామాజిక మాధ్యమ మోసాలు, ఆర్థిక మోసాలు, హ్యాకింగ్ మరియు లైంగిక వేధింపుల వంటి సైబర్ నేరాలకు సంబంధించినవి. యూపీఐ స్కామ్లు మొత్తం సైబర్ నేరాల్లో 45 శాతం, ఆ తర్వాత 15 శాతం ఓటీపీ మోసాలు, ఫోన్ కస్టమర్ సర్వీస్, పెట్టుబడి మోసంతో పాటు ఇతర సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications