ప్రభుత్వాల మీదకు వేటకుక్కలను ఉసిగొల్పిన బీజేపీ?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిందని, వాటిని కూల్చేందుకు వేటకుక్కలను ఉసిగొల్పుతోందని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హాజరయ్యారు. నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్రెడ్డితోపాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, దేశ ప్రయోజనాలను ఆశించి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. నరేంద్రమోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, చెప్పేవన్నీ ఫాల్త్ మాటలని మండిపడ్డారు. తెలంగాణకు మోడీ ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియంతలా దేశాన్ని పరిపాలిస్తున్నారని, ఈ పాలనకు నిరసనగా అందరూ గొంతు విప్పాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవడంలేదని, మోడీ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, ఆ పార్టీకి కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. బీజేపీకి నిజంగా గిరిజనులమీద ప్రేమ ఉంటే ఖమ్మం జిల్లా నుంచి తాము కోల్పోయిన ఏడు గిరిజన మండలాలను వెనక్కివ్వాలని కోరారు. బీజేపీ కార్యాలయం వద్ద కేసీఆర్ ఫొటో ఏర్పాటు చేసి తప్పుడు రాజకీయాలు చేస్తోందని, తాము తలుచుకుంటే నరేంద్రమోడీ ఫొటోకు చెప్పుల దండ వేయగలమన్నారు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే బీజేపీ వ్యవహారం తెలంగాణలోను, దేశంలోను అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.