హుజురాబాద్ బరిలో తెలంగాణ జన సమితి... ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీ... కోదండరాం కీలక ప్రకటన
హుజురాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. పార్టీ విధి విధానాలపై త్వరలోనే అంతర్గత సమీక్ష ఉంటుందన్నారు. పార్టీ నిర్మాణంలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటామని... పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జన సమితి కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం(జులై 11) కోదండరాం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్లో టీజేఎస్ విలీనం? రేవంత్ పగ్గాలు చేపట్టాక తెర పైకి ఈ ప్రచారం... కోదండరాం రియాక్షన్ ఇదే...
అలాంటి రాజకీయాలకు మేము దూరం : కోదండరాం
హుజురాబాద్ ఉపఎన్నికలో డబ్బులు కుమ్మరించి గెలిచేందుకు టీఆర్ఎస్ తాపత్రయ పడుతోందని కోదండరాం విమర్శించారు. అగస్టులో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. అమరవీరుల ఆశయ సాధనే తమ తొలి ప్రాధాన్యత అని... అమ్ముడు కొనుడు రాజకీయాలకు తాము దూరమని స్పష్టం చేశారు.స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయే రాజకీయాలు టీజేఎస్ చేయదని అన్నారు. ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలు,ఇన్చార్జిలను నియమిస్తామన్నారు.
ఇప్పటివరకూ ప్రభావం చూపించని పార్టీ
తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా చేరిన టీజేఎస్కు కేవలం 8 స్థానాలే దక్కాయి. అందులోనూ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయింది. అయితే పార్టీ ఏర్పాటైన కొద్ది నెలలకే ఎన్నికలు రావడంతో అనుకున్నంత స్థాయిలో పార్టీ నిర్మాణం,కార్యాచరణ జరగలేదని అప్పట్లో కోదండరాం వెల్లడించారు.
హుజురాబాద్లో పోటీ...
ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన కోదండరాం మూడో స్థానానికి పరిమితమైన సంగతి తెలిసిందే. టీజేఎస్ ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీ ప్రస్థానం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ కోదండరాం మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ట్రయాంగిల్ ఫైట్గా కనిపిస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలను తోసిరాజని టీజేఎస్ అక్కడ ప్రభావం చూపించగలదా...? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కోదండరాం మాత్రం తాము ప్రభావం చూపించగలమన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. చూడాలి మరి హుజురాబాద్లో టీజేఎస్ ఎంతమేర ప్రభావం చూపించగలదో.