తెలంగాణా కుంభమేళా; మేడారం మహాజాతర రేపటి నుండే..తల్లుల ఆగమనం కోసం వనమంతా జనమే!!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతర మేడారం జాతర . తెలంగాణా కుంభమేళా అయిన మేడారం జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర నేపధ్యంలో వనమంతా జనసంద్రంగా మారింది . జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది.
Recommended Video
విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. కొండా కోనల్లో గిరిజన సాంప్రదాయాల మేరకు నిర్వహించే ఈ జాతరకు ఇప్పటికే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వెళ్తున్నారు. ఎడ్ల బండ్ల నుండి హెలికాఫ్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి , ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.
రెండేళ్లకోసారి మేడారం మహా జాతర ..వివిధ రాష్ట్రాల నుండి భక్తులు
తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని మేడారం ఒక గిరిజన కుగ్రామంలో జరగనున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చేందుకు ఇప్పటికే అందరూ మేడారం బాట పట్టారు. రెండేళ్లకు ఒకసారి మేడారం మహా జాతర గిరిజన సాంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. కోట్లాది మంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని తరిస్తారు.
ప్రకృతి మొత్తం మేడారంలో సమ్మక్క, సారలమ్మల నామజపంతో , ఎదురు కోళ్ళతో , శివసత్తుల పూనకాలతో ఆద్యంతం భక్తి పారవశ్యంతో మునిగిపోతుంది. జంపన్న వాగు స్నానాలు ఆచరించటానికి సిద్ధం అయ్యింది. ఛత్తీస్ గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవటానికి మేడారం బాట పట్టారు.సుదూర ప్రాంతాల నుండి కాలినడకన అమ్మలను దర్శించుకోటానికి వచ్చే భక్తులు కూడా ప్రతీ మేడారం జాతరలో కనిపిస్తారు.
గిరిజన సంప్రదాయాన్ని కళ్ళకు కట్టే జాతర.. కోటికి పైగా భక్తులతో మేడారంలో సంబరం
గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర''లో అత్యంత ప్రత్యేకత ఆ తల్లులకు ఎలాంటి విగ్రహాలు లేకపోవటం . చిలకలగుట్ట మీద నుండి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తెచ్చి గద్దె మీద ప్రతిష్టించటం .. మేడారంలో చాలా ఘనంగా రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది. .. ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుతుండగా.. ఆ ప్రాంగణమంతా భక్త జన సందోహంతో కోలాహలంగా మారింది.
ఇప్పటికే 50 లక్షల మంది వన దేవతలను దర్శించుకున్నారు . జాతర జరిగే ఈ నాలుగు రోజుల్లో 80 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. మేడారానికి వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భక్తుల కోసం ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా, తెలంగాణ పర్యటక శాఖ హెలికాప్టర్ సర్వీసులు కూడా ప్రారంభించింది.
రేపటి నుండే మేడారం మహా జాతర .. తల్లుల ఆగమనం కోసం భక్తుల నిరీక్షణ
ఇక రేపటినుండి నాలుగు రోజుల పాటు మహాజాతర కొనసాగుతుంది. రేపు 16 వతేదీనజాతరలో తొలి ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది . సారలమ్మ , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది.
17న సమ్మక్క ఆగమనంతో కీలక ఘట్టం
ఎల్లుండి 17వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం . కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు.
ఈ సమయంలో పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి మరీ ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం ఉంటుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలా చర్యలు చేపట్టింది.