తెలంగాణలో ఆ ముగ్గురు మంత్రుల కీలక భేటీ: అత్యున్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడ్డారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వంటి ఉన్నతాధికారులకు కూడా వైరస్ సోకింది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఒక్కరోజే మూడువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ సర్కార్.. తక్షణ నివారణ చర్యలపై దృష్టి సారించింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను నియంత్రించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ ప్రొటోకాల్స్కు అనుగుణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ను రూపొందించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గ్రామస్థాయిలో ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహంచనుంది.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఇవ్వాళ ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్, అదనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి వైద్యాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో ఈ భేటీ కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మున్సిపాలిటీలు, పంచాయతీ స్థాయి సిబ్బంది సమన్వయం చేసుకోవడానికి వీలుగా నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.
రోజువారీ కేసులకు అనుగుణంగా ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, బెడ్స్ సంఖ్యను పెంచడం, చాలినన్ని ఆక్సిజన్ నిల్వలు, ఐసీయూల్లో వినియోగించే పరికరాలను అందుబాటులో ఉంచుకోవడం, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం, 15-18 వయస్సున్న వారికి అందజేస్తోన్న టీకాల పర్యవేక్షణ.. వంటి కీలక అంశాలపై మంత్రులు ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలను తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులకు తగిన ఆదేశాలను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.