ఆంధ్రకు వ్యతిరేకం కాదు: కోదండ, ఏపీకి 8వేల కోట్లిచ్చి తెలంగాణకు ఏది: కవిత
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ ప్రజలు ఆంధ్ర వ్యక్తులను కాక, వారి పెత్తనాన్నే వ్యతిరేకించారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ కోదండరాం గురువారం అన్నారు. తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందనే ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నామని గుర్తు చేశారు.
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విభజించాలంటూ రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో గురువారం ఉద్యోగులు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యాన విశ్వవిద్యాలయంలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల పరిశోధన కేంద్రాలలో మొత్తం 27మంది శాస్త్రవేత్తలు ఉంటే వారిలో 21మంది ఆంధ్రప్రాంతానికి చెందినవారు, ఆరుగురు తెలంగాణ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపించారన్నారు.

రాజేంద్రనగర్ కళాశాలలోని 15మందిలో 12మంది సీమాంధ్రులు ఉన్నారన్నారు. ఆంధ్రప్రాంత శాస్త్రవేత్తలంతా హైదరాబాద్ పరిసరాలలోనే ఉన్నారన్నారు. ఈ ప్రాంత ఆకాంక్షలు తెలిసినవారు అధికారులుగా ఉన్నప్పుడే కొండా లక్ష్మణ్ ఆశయాలు సాకారమవుతాయన్నారు. చట్టప్రకారం జరగాల్సిన విభజన ఇంకా జరగకపోవడం పట్ల కోదరడరాం ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు: కవిత
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. ఏపీకి రూ.8వేల కోట్లు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ సమైక్య స్ఫూర్తి అంటూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. నిధుల కోసం టిఆర్ఎస్ ఎంపీలం పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. కెసిఆర్ను, తెలంగాణను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications