యూపీ కంటే టీలోనే: అమిత్, తోక ముడిచారు: కిషన్
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీకి 23 శాతం ఓట్లు రావడం సామాన్యమైన విషయం కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాదులో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ కంటే తెలంగాణ ప్రజలే బీజేపీని ఎక్కువగా ఆదరించారన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగు ప్రజలను విభజించిందన్నారు.
ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదర్చకుండానే విభజించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ నిరంతరం రాజకీయాలు చేసిందన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా విభజించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారత్కు విముక్తి కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీపై తెలంగాణ ప్రజలలో ఎక్కువ ఆశలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని ఎలా అవుతారో చూస్తామని అనేకమంది అన్నారని, మోడీ హైదరాబాదులో అడుగు పెట్టగానే విమర్శకులు తోకముడిచారని మజ్లిస్ పార్టీని ఉద్దేశించి అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది విద్యార్థులేనని, విద్యార్థుల త్యాగాల పైన లోకసభలో మాట్లాడింది బీజేపీయే అన్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే తిన్నది అరక్క విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని అంటున్నారన్నారు. తెరాస ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాలను అవమానపరుస్తోందన్నారు. ఉద్యమం చేసేందుకు ఓయూ విద్యార్థులు కావాల్సి వచ్చారని, ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను తిడుతున్నారన్నారు.