తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ఖర్గే వ్యాఖ్యలతో కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర బడ్జెట్ ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే దివాళా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'గౌరనీయులైన ఖర్గే గారు.. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..? కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా?
తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు.. ' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో..తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైంది.. తెలంగాణ ప్రజలను నమ్మించి.. నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ.. నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం.. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి... ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది..! గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది..!!' అని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచింది.
— KTR (@KTRBRS) November 1, 2024
వానాకాలం వరికోతలు సాగుతున్నయ్.
కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదు.
రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదు.
కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల… pic.twitter.com/jPMGqSCHO5
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను నిండా ముంచిందంటూ మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. వానాకాలం వరికోతలు సాగుతున్నయ్. కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదు. రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది' అని ధ్వజమెత్తారు.
ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.రైతన్న అంటే ఎంత నిర్ల్యక్షం చూడండి! దళారులతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచింది. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్తో బిజీబిజీగా ఉన్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేటీఆర్.












Click it and Unblock the Notifications