తెలంగాణాకు బంగాళాఖాతం హెచ్చరిక.. అప్పటినుండి మళ్ళీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఇంకా అడపా దడపా కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకపక్క శీతాకాలం చలి వణికిస్తుంటే మరోపక్క ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల పైన దాడి చేస్తున్నాయి.
అల్పపీడనాల కారణంగా వర్షాలు
తరచూ ఏర్పడుతున్న అల్ప పీడనాల వలన కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం తాజాగా నేడు దక్షిణ అండమాన్ సముద్రం మీదగా ఉపరితల ఆవర్తన విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇది రేపటికి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.

ఏపీ, తెలంగాణాలలో వర్షాలు
ఆ తదుపరి 48 గంటల్లో ఈ అల్ప పీడనం కాస్తా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ మంగళవారాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నేటి నుండి 17 వతేదీ వరకు వాతావరణం ఇలా
ఇక ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు మాత్రమే కాదు డిసెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత 17 వతేదీ నుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణాలో అప్పటినుండి వర్షాలు
తెలంగాణలో డిసెంబర్ 17వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలను జారీ చేయలేదు. కనుక వర్ష ప్రభావం తెలంగాణాపై పెద్దగా ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. అయినప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలో పెరుగుతున్న చలి
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇప్పటికే శీతాకాలం కావడంతో ఉదయం పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రిల సెల్సియస్ వరకు తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాదులో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మెదక్ లో 12, హనమ్మకొండ లో 12.5, రామగుండంలో 13.4, నిజమాబాద్ 13.9, దుండిగల్ లో 14.8, హకీంపేట్ లో 15.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications