తెలంగాణా ప్రజలకు తీవ్ర హెచ్చరిక.. ఎల్లో అలెర్ట్ జారీ!!
వాతావరణ శాఖ అధికారులు వర్షాలు కురుస్తాయని చెప్పడమే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేర వర్షాలు మాత్రం కురవడం లేదు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అంతంత మాత్రమేనని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది.
తెలంగాణలో వర్షాల తాజా పరిస్థితి ఇలా
ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. కానీ ఈసారి జూన్ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చాయని ముందస్తు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ పెద్దగా వర్షాలు పడిన దాఖలాలు లేవు. జులై మాసం వచ్చినప్పటికీ అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు తప్పించి, చెరువులు నిండేలా, వాగులు వంకలు పొంగి పొగిలిపోయేంత వర్షాలు పడిన జాడే లేదు.

వర్షాలపై వాతావరణ శాఖ అలెర్ట్
కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షపాతం నమోదు కాగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించగా, మరికొన్ని జిల్లాలలో ఇప్పటివరకు అవసరం మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జిల్లాలలో వర్షాలు
కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
12 జిల్లాలలో భారీ వర్షం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు, రైతు కూలీలు, కాపరులు ఎవరూ చెట్ల క్రిందకు వెళ్ళకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు హైదరాబాదులో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications