తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు... 23 మంది మృతి... బ్యాంకు పనివేళల కుదింపు...?
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 5వేల మార్క్ని దాటుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 20) రాత్రి 8గం. నుంచి బుధవారం(ఏప్రిల్ 21) రాత్రి 8గం. వరకు 5567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. మరో 4701 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం(ఏప్రిల్ 22) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కరోనా కేసుల వివరాలు...
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,788కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1899కి చేరింది. ప్రస్తుతం 49,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,21,788కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.50శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 84.5శాతం ఉండగా తెలంగాణలో 86.16 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 989 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,21,75,425 కరోనా టెస్టులు నిర్వహించారు.
బ్యాంకు పనివేళల కుదింపు...
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పని వేళలను కుదించే యోచనలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) ఉంది. ఇకపై ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పని వేళలను పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారినపడటంతో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. అలాగే కేవలం 50శాతం సిబ్బందితోనే బ్యాంకులను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నిర్ణయాలు అమలయ్యే అవకాశం ఉంది. బ్యాంకు పని వేళలు కుదిస్తున్నందునా ఏటీఎంలు,క్యాష్ డిపాజిట్ మిషన్లు సహా ఆన్లైన్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఎస్ఎల్బీసీ బ్యాంకర్లను ఆదేశించినట్లు సమాచారం.
దేశంలో 3లక్షలకు పైగా కేసులు...
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,59,30,965కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22లక్షల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 2104 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,84,657కి చేరింది. బుధవారం 1,78,841 మంది కరోనా నుంచి కోలుకోగా... దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1కోటి 34లక్షల మంది రికవరీ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 13.23కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.